గీతా జయంతి ఏం చెబుతోంది..?
గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారు.
భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహన ఎట్లా చేయాలో తెలియక తపన చెందే హృదయానికి ఉపశమనంగా అనుగ్రహించినటువంటి మహోపదేశం. అర్జునుడికే కాదు, కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకి సందిగ్దతకి సమాధానంగా భగవద్గీత ఈ నాటికీ ప్రమాణంగా నిలుస్తుంది, ఏ నాటికీ ప్రమాణంగా నిలుస్తుంది.
ఈ రోజు కౌరవ రాజు ధృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు.
గీకారం త్యాగరూపం స్యాత్
తకారమ్ తత్వబోధకమ్
గీతా వాక్య మిదమ్ తత్వం
జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:
గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. "గీ" అనే అక్షరం త్యాగాన్ని ను బోధించుచున్నది. "త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు.
త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది . అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ , బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది.
ఈ పవిత్రమైన గ్రంథంలో పొందుపరచబడిన శ్లోకాలు ప్రతి ఒక్క వ్యక్తి విజయవంతంగా ముందడుగు వేయడంలో ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి. మహాభారతంలో కురక్షేత్రం సమయంలో శ్రీ క్రిష్ణుడు అర్జునుడికి గీతా బోధనల ద్వారా ధర్మ, కర్మ, జ్ఞానాన్ని అందించి వారి జీవితాల్లో వెలుగు నింపాడు.
ఎంతో ప్రాధాన్యత ఉన్న భగవద్గీతలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో తొలి ఆరు అధ్యాయాల్లో కర్మయోగ బోధన, ఆ తర్వాతి 6 అధ్యాయాల్లో జ్ఞాన యోగం, చివరి అధ్యాయాల్లో భక్తి యోగం గురించి వివరించబడింది. వీటిని పఠించడం వల్ల ఎంతో జ్ఞానం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. వీటిలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
ఒక మనిషి మనసు చాలా చంచలమైంది. ఏదైనా పొందాలనే కోరికతో తను దారి తప్పిపోవచ్చు. కాబట్టి మీ జీవితాన్ని విజయ పథంలో నడిపించాలంటే మీ మనసును అదుపులో ఉంచుకోవాలని శ్రీ క్రిష్ణుడు గీతలో వివరించాడు.
ఈ లోకంలో ఉండే ప్రతి జీవిత తన కర్మలను బట్టి ఫలితాల్ని పొందుతాడని శ్రీ క్రిష్ణుడు వివరించాడు. అందుకే పని చేస్తున్నప్పుడు ఫలితం గురించి ఆందోళన చెందడం వ్యర్థం. మీరు ఏ పనిలో విజయం సాధించకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఫల్యం కూడా జ్ఞానానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఓటమిలోనూ పాఠం నేర్చుకోవాలని గుర్తు చేస్తుంది.
భగవద్గీత ప్రకారం, ఎవరైనా తమ జీవితంలో ఏదైనా లక్ష్యాలన్ని సాధించాలంటే ముందుగా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే కోపంలో ఒక వ్యక్తి ఇతరులకు హాని చేయడమే కాదు.. తనకు తాను కూడా హాని చేసుకోవచ్చు. అంతేకాదు కోపం అనేది గందరగోళంగా మారుస్తుంది. ఆలోచించే, అర్థం చేసుకునే శక్తిని నాశనం చేస్తుంది.
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః
పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్
ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు , సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా, అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి , ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే మరోపక్క లోకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందిచాడట.
అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి , ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో , అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు.
ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు , మన వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః. అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.
Comments
Post a Comment