తిరుప్పావై 23వ పాశురం | Thiruppavai pasuram 23 in telugu | dhanurmasam | Bhakthi Margam | భక్తి మార్గం


తిరుప్పావై 23వ రోజు పాశురము

23వ రోజు - సృష్టి కార్యం నుండి తరువాత వరకు స్వామి దశ
ఆండాళ్ తిరువడిగలే శరణంమ

23పాశురము

మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం
శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు
వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందుదఱి
మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు
పోదరుమా పోలే నీ పూవైప్పూ వణ్ణా ఉన్
కోయిల్ నిన్ఱు-ఇంగనే పోందరిళి క్కోప్పుడైయ
శీరియ శింగాశనత్తిరుందు యాం వంద
కారియం ఆరాయ్-అందరుళ్-ఏలోర్ ఎమ్బావాయ్

ఈ రోజు ఆండాళ్ ఒక సింహం తన గుహలోంచి బయలుదేరి ఎట్లా వస్తుంది అనే అద్భుత వర్ణన ఈ నాటి పాటలో చేస్తుంది, అందుకే ప్రకృతి గురించి అధ్యయనం చేయాలన్నా తిరుప్పావై చదవాలి, సాహిత్యం తెలియాలంటే తిరుప్పావై లోకి రావాలి, ఉపమానోపమేయాల గురించి తెలియాలంటే తిరుప్పావై చదవాలి, ఇక ఇదీ అదీ అని నియమం లేదు అన్నట్లుగా సవాలు విసురుతుంది తిరుప్పావై. అన్నింటికి ఇది మూలం ఇక్కడి నుండే బయటకు వచ్చినవి మాత్రం మనకు సాక్షాత్కరిస్తుంది అని చెప్పవచ్చు.

ఈ రోజు అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొల్పే పాశురం. భగవంతుణ్ణి చేరే వరకే శాస్త్రం, ఇక చేరిన తర్వాత ఇక శాస్త్రానికి ప్రాదాన్యం లేదు. లోకంలో మనకు తెలుసు ఎలగైతే వివాహం జరిగే వరకే శాస్త్రం ఇకపై శాస్త్రాలు వర్తించవు ఇరువురి ప్రేమ విషయంలో, అట్లానే భగవంతుణ్ణి చేరే వరకు ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో రకాల పరిక్షలు ఉంటాయి. ఇక భగవంతుణ్ణి సన్నిధానానికి చేరాక ఇక భగవంతుడు భక్తుల పట్ల సర్వాత్మనా చెందే ఉంటూ తను వాళ్ళు ఆదేశించినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు.

ఈ విషయాన్ని మనం రామాయణంలో గమనించవచ్చు. రాముడు విభీషనుణ్ణి అనుగ్రహించాల్సి వచ్చింది. మొదట తన అభిప్రాయం చెప్పడం, లక్ష్మణ, సుగ్రీవాదులను ఒప్పించటం, తరువాత సుగ్రీవుణ్ణి పంపి విభీషనుణ్ణి రప్పించటం ఒక పెద్ద ప్రక్రియ సాగింది.“లోచనాభ్యాం పిభన్నివ”అంటూ ఒక కంటి చూపుతో తను విభీషనునికి రక్షణ ఇవ్వటంలో జరిగిన కాల విలంబనని తెలుపుతూ దగ్గరకు తీసుకున్నాడు. 

అలాగే మనవాళ్ళంతా స్వామి సన్నిధానానికి చేరగానే స్వామి తన స్వతంత్రాన్ని పక్కకు పెట్టాడు. శరణు అంటూ వచ్చిన విభీషనుడికి రాముడే దాసుడై విభీషనుడు చెప్పినట్లూ చేసాడు. విభీషనుడు రాముడిని చేరటానికి శరణాగతే మార్గం అయినందున, అదే మార్గం రాముడికీ చెప్పాడు. సముద్రుడికి శరణాగతి చేయ్యటం ఆ సముద్రుడు అర్హుడా కాడా అని కూడా చూడలేదు రాముడు. ఇదీ స్వామి తత్వం భక్తుల విషయంలో. తన స్వతంత్రాన్ని పక్కన పెట్టేస్తాడు.

అందుకే మన వాళ్ళు నిన్న స్వామిని ఎట్లా కళ్ళు తెరియాలో ఆదేశించారు. ఈ రోజు పాటలో గోదాదేవి స్వామిని లేచి, క్రమంగా నడచి వచ్చి సింహాసనం పై కూర్చోని తమ మొరలని ఆలకించమని ప్రార్థిస్తుంది. “క్కోప్పుడైయ శీరియ శింగాశనత్తిరుందు” నీకు తగిన అద్భుతమైన సింహాసనం ఉంది, దానిపై కూర్చుని ఉంటే మేం అడిగినవి తప్పక ప్రసాదిస్తావు. దానిపై నీవు కూర్చొంటే “యాం వంద కారియం ఆరాయ్-అందరుళ్”మేం ఒక కార్యార్తులమై వచ్చాం, మేం ఎం చేయదల్చుకున్నామో తెలుసుకొని మేం ఎట్లా చెయ్యలో మాకు తెలుపు.

ఈ ప్రక్రియలో భాగంగా గోదాదేవి స్వామిని ఎట్లా లేచిరమ్మని చెబుతుంది అనేది ఒక అద్భుతమైన వర్ణన. గోదాదేవి యొక్క తిరుప్పావై కొన్నింటిని తనతో పాటు సమానంగా తీసుకొని వస్తుంది. అందులో ఒకటి పైపైకి కనిపించే కృష్ణ-గోపికల కథ. రెండవది తిరుప్పావై సారాంశమే వేదం కనుక తత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి జరిగే ప్రక్రియ ఏమిటి అనేది చెబుతుంది. 

ఇక మూడవది మనం భగవంతుణ్ణి చూసే స్థానానికి వెళ్ళేప్పుడు మనల్ని మనం ఎట్లా సిద్దం చేసుకొని వెళ్ళవలె అనేది తెలుపుతుంది. భగవంతుణ్ణి ఈ ప్రకృతి మండలాల్లో చూడగలిగే స్థానం విగ్రహా రూపకంలోనే కదా, అది మన ఇంట్లో ఆరాధన చేసుకొనే విగ్రహం ఐనా కావచ్చు లేక ఆలయాల్లో ఉన్న అర్చా మూర్తి ఐనా కావచ్చు. అప్పుడప్పుడు మన ఆలయాల్లో భగవంతుడు బయటికి వస్తూ ఉండే ఆ పద్దతి ఏంటి, ఇక నాలుగవది శ్రీకృష్ణుడు తన భవనంలోంచి ఎట్లా రావాలి ఇవన్నీ తెలుపుతూ వస్తుంది ఆండాల్ తల్లి.

ఇక స్వామి ఎలా రావాలో చెబుతూ వానా కాలంలో కొండ గుహల్లో నిదురించే సింహం తనంతట తాను మేలుకాంచి బయటికి వచ్చే ప్రక్రియ ఎట్లా ఉంటుంది అనేది వర్ణిస్తుంది. “మారి” వానాకాలం అనగానే విడిగా ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తుంది, కలిసిన వారికి ఆనందాన్ని ఇస్తుంది, వైరాలని మరిపిస్తుంది. యుద్దాలు చేసేవారు కూడా వానా కాలంలో ఆపేస్తారుకదా. సుగ్రీవుడు రాజ్య సుఖాలతో హాయిగా ఉంటే, రాముడు మాల్యాద్రి పర్వతం పై ఉండి తనకు జరిగిన సీతా విరహాన్నీ లక్ష్మణ స్వామికి విన్నపించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మనం కూడా ఒక వానాకాలంలోనే ఉన్నాం మరొక వానా కాలం కోసం ప్రతిక్షిస్తున్నాం.

ఏ వానా కాలంలో ఉన్నాం అంటే రక రకాల దుఃఖాలను సంతతమూ వర్షించే ఈ భూమి పై ఉన్నాం కదా “బహుదా సంతత దుఖ:వర్శిని బవ దుర్దినే అద:స్కలితం” అంటారు మన యామునాచార్యులవారు. ఈ సంసారం అనే అరణ్యంలో దారి తప్పి సంచరిస్తున్నాం, “అవివేక ఘన అంద ద్విగ్ముఖే” అవివేకం అనే కారు మబ్బులు జ్ఞానమనే సూర్యున్ని కప్పుకొని దారి తప్పి పోయాం. వివేకం అంటే విడదీసి బ్రతకటం, దేన్ని విడదీసి అంటే ఆత్మను మరియూ శరీరాన్ని వేరుగా చూసి బ్రతకడం, ఇలా బ్రతకక పోవడమే అవివేకం, దీనివల్ల నిరంతరం దుఃఖం వర్షింస్తుంది, సూర్యుడు కనిపించడం లేదు. 

మనలోని అజ్ఞానం మనల్ని ఎప్పటికి వదిలి ఉండని అచ్యుత భానున్ని కనిపించకుండా చేస్తుంది. మరి ఆ మబ్బుల్ని మన అంతట మనం తొలగించుకోగలమా, లేదు కదా, మరి ఆ సూర్యుడే తనంతట తాను మనకు కనిపించే ప్రయత్నం చేయాలే తప్ప మనం ఆయనను చూడలేం. అందుకే “మాం అవలోకయా అచ్యుత” అని ప్రార్థిస్తారు. నేను నిన్ను చూడలేను, నీవే ఆటంకాలు తొలగించు. అలా ప్రార్థిస్తూ మరొక వాన కావాలని మన పూర్వులు కోరుతున్నారు, అదేంటంటే

“త్వదీక్షణ సుదా సింధు విక్షేప పసీకరైహి|

కారుణ్య మారుతా నీతైహి శీతలైహి అభిషించమాం||”

"హే భగవన్! నీ చూపులే సాగరాలు, అందులో కారుణ్యం అనే గాలులు వీస్తుంటాయి, ఆ గాలుల వల్ల సముద్ర జలాలు గాలిలో తేలుతూ ఒడ్డున ఉండే వారికి సోకి ఎంతటి ఆహ్లాదాన్ని ఇస్తాయో అలాగే నీ చల్లని నేత్రాల ద్వారా నీదయని కురిపించి ముంచెత్తు". ఈ వానను కోరుకుంటున్నారు.

అలాంటి వానాకాలంలో “మలై మురైంజిల్” పర్వతపు గుహల్లో “మన్ని క్కిడందుఱంగుం” మన్నికగా కాల్లు ముడుచుకొని పడుకొని నిదురించే “శీరియ శింగం” నిద్రలో కూడా పరాక్రమాన్నీ వీడక ఉండే సింహం. శక్తి తేజస్సు ఎప్పటికి కల్గిన సింహం. సింహం తనంతట తానూ లేచి రావాల్సిందే కాలం లేపినప్పుడు, కానీ ఎవ్వరు దానిని లేప తగరు. 

ఆండాళ్ తల్లి ఈ సింహం ఎలాగైతే మృగరాజైనట్లుగా, సాక్షాత్తు జీవులకు రారాజైన ఆ భగంతుడిని భావిస్తుంది. సింహం ఎలాగైతే గుహల్లోంచి బయటకు రావడం అనేది మన ఆలయాల్లోంచి ఉత్సవమూర్తి బయటకు రావడమా అన్నట్లుగా చెబుతుంది. “శీరియ శింగం” శ్రీతో కూడుకున్న స్వామి. అయితే స్వామి సంకల్ప విశిష్టుడై ఉంటాడు కదా, సృష్టికి పూర్వదశ కూడా నిర్గుణ దశ కాదు అని ఉపనిషత్తులు చెప్పినట్లుగానే ఆండాల్ అది “శీరియ శింగం”అని చెబుతుంది.

“అరివుత్తు”ఆ సింహం తనంతట తాను లేచి “త్తీవిరిత్తు”ఒక్క సారి తన తేజస్సును బయటకు నేత్రాల నుండి కనిపించేట్లుగా తెరిచింది. “వేరి మయర్ పొంగ” తన జూలును గగుర్పాటు వల్ల ఒక్క సారి దులుపు కొని “ఎప్పాడుం పేరుందుదఱి” ఇటూ అటూ దొర్లుతూ,“మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు”ఒక పెద్దగా గర్జిస్తూ “పోదరుమా పోలే”అప్పుడది బయలుదేరినట్లే నీవూ అట్లా రావాలి.

సృష్టి పూర్వ దశ నుండి సృష్టి తరువాత దశ వరకు ఆండాళ్ స్వామిని సింహంతో పోలుస్తుంది. ఆది ఎట్లా అని చాందోగ్య ఉపనిషత్ వర్ణిస్తుంది. సృష్టికి ముందు భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడట. ఆసంకల్పం “తడైక్షత భహుష్యాం ప్రజా యేయేతి”నేనే నానుండి అనేక మందిని తీద్దును గాక అనుకుంటాడట. ఇక సృష్టి చేయడం ఎలా అంటే త్రివుత్కరణం అని చెబుతారు.

మొదట తనలోంచి తేజస్సుని తీస్తాడు, తేజస్సులోంచి జలాన్ని తీస్తాడు, జలంలోంచి పృథ్విని తీస్తాడు. ఇక వీటిని సగం సగం సగం భాగాలుగా చేస్తాడు. ప్రతి రెండో భాగాన్ని మల్లీ సగం సగం చేస్తాడు. ఇప్పుడు ప్రతీదీ ఒక పెద్ద భాగంగా రెండు చిన్న భాగాలుగా ఉంటాయి. ఇక అన్ని భాగాలు ఒక్కో దానిలో వచ్చేట్లుగా పంచి మూడింటిని సిద్దం చేస్తాడు. అయితే ప్రతీదాంట్లో ఏదో ఒక భాగం ఎక్కువగా ఉండి మిగతావి రెండు తక్కువగా కల్గి ఉంటాయి. 

ఇవన్నీ కల్పి ఒక అండం క్రింద తయారు చేస్తాడు. దీన్నే బిగ్ బ్యాంక్ అని ఇప్పటి వాళ్ళు చెబుతున్నారే అది. “యుగప్పత్ సృష్టికార్యం”ఒక చిటికెలో సృష్టికార్యం జరిగి పోయింది, అనేక కోట్ల అండాలు బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన ఒక అండంలో ఒక గోళంలో మనం ఉన్నాం. ఈ బయటకు వచ్చిన ప్రతి అండంలో ఒక బ్రహ్మను పెడుతాడు. ఆ బ్రహ్మ శరీరంలోంచి పదకొండు ప్రజాపతులను బయటికి తీస్తాడు. ఇంతవరకు తాను నేరుగా చేస్తాడు. దీన్నే అద్వారక సృష్టి అంటారు. బ్రహ్మకు వేద ఉపదేశం చేసి, ఇక పై బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు. ఇది సద్వారక సృష్టి. ఇక బ్రహ్మ సృష్టించాక అన్నీ వస్తువులలో అంతర్యామి అయ్యి తానుంటాడు.

ఈ కార్యాన్నంతా ఆండాళ్ తల్లి ఇక్కడ చెబుతుంది. ఒక శీరియ సింహం అంటే సంకల్ప విశిష్టుడైన స్వామి, సింహం ఎలాగైతే తనంతట తాను లేచిందో, సృష్టి ఎవరో ప్రేరేపిస్తే చేసేది కాదు, తనంతటా తానూ ఐచ్చికంగా చేసేది. ఇక సింహం ఎలాగైతే తన తీక్షణమైన కళ్ళు తెరిచిందో పరమాత్మ తనలోంచి తేజస్సును బయటికి తీస్తాడు. సింహం తన జూలును విప్పార్చి తన పరిమళాన్ని అన్నివైపులా వెదజల్లినట్లే, అయితే శాస్త్రం “గందవతీ పృథ్వీ” అని చెబుతుందికదా, పరమాత్మ పరిమలం కల భూమిని దానిలోంచి నీటిని బయటికి తీస్తాడు. 

ఇక సింహం పడి అన్నివైపులా పొర్లుతున్నట్లుగా పరమాత్మ త్రివుత్కరణం చేసాడు. ఇక సింహం ఎలాగైతే సాగిందో పరమాత్మ తన సృష్టికార్యాన్ని సాగించాడు. ఏర్పడ్డ ఒక్కో అండంలో ఒక్కో బ్రహ్మను ఉంచాడు. సింహం ఎలాగైతే గర్జించిందో తాను బ్రహ్మకు వేదాలని ఉపదేశం చేసాడు. ఇక సింహం తన యాత్రను ముందుకు సాగించినట్లే, పరమాత్మ అన్నింటిలో అంతర్యామియై ఉన్నాడు. ఇక్కడ గోదాదేవి నాభిస్తానంలో పవళించి ఉన్న ఆ అంతర్యామిని తన హృదయ సింహాసనంలోకి నిలిచి ఉండేలా రమ్మని భావిస్తుంది. ఆలయాల్లో ఉత్సవ విగ్రహం పురపాడుకి బయలుదేరినట్లుగా కూడా భావిస్తుంది.

గర్భాలయాల్లో ఉండే మూర్తి కదలడు కనుక కదిలే రూపంలో ఉత్సవ విగ్రహంగా మనకు దర్శనం ఇస్తాడు. “నీ పూవైప్పూ వణ్ణా” అదసీ పుష్పం వంటి సౌందర్యం కలవాడా, “ఉన్ కోయిల్ నిన్ఱు”నీ కోవల నుండి, అంటే ఓంకారమనేదే స్వామి ఇల్లు కదా ఆ వేద తత్వమనేది బయటికి రావాలి తన స్థానాన్ని ప్రదర్శించాలి. ఇక ఆలయాల్లోంచి ఉత్సవమూర్తి బయటికి రావాలి, ఇక శ్రీకృష్ణుడు తన మందిరంలోంచి బయటికి రావాలి ఇన్నింటిని ఆండాళ్ భావిస్తోంది. “ఇంగనే పోందరిళి”ఇలానే రావాలి అని చెబుతుంది, మన ఆండాల్ “అన్నవయల్ పుదువై ఆండాళ్” పరమహంసలే నడక నేర్పగలిగేది కద, తాను శ్రీకృష్ణుడి కూడా నేర్పుతుంది.

“క్కోప్పుడైయ శీరియ శింగాశనత్తిరుందు” అలంకృత సింహాసనంపై కూర్చొనమని ప్రార్థిస్తుంది ఆండాళ్. ఇక్కడ సింహాసనం అంటే మన హృదయ సింహాసనం. జ్ఞాన, అజ్ఞాన, ఐశ్వర్య, అనైశ్వర్య, ధర్మ, అధర్మ, వైరాగ్య ఇహ్యాదులు అన్నీ కలిసి ఉండే ఈ ఆసనంలోంచి సృష్టికి కావల్సిన సృజ్య వస్తువులు వస్తూ ఉంటాయి, ఇక ఆలయాల్లో అయితే దర్మ పీఠాసనం అంటారు, ఇక శ్రీకృష్ణ భవనంలో సింహాసనం ఇన్నింటినీ భావిస్తూ ఆండాళ్ శ్రీకృష్ణున్ని దానిపై కుర్చొమ్మని చెబుతుంది.

ఆండాళ్ తిరువడిగలే శరణం
జై శ్రీమన్నారాయణ్

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags: thiruppavai pasuram in telugu lyrics,thiruppavai telugu pdf with meaning, thiruppavai pravachanam in telugu pdf, thiruppavai pravachanam by chinna jeeyar swamy, thiruppavai pdf telugu, thiruppavai pasuram in telugu lyrics, goda devi pasuram in telugu pdf, goda devi ashtottara shatanamavali in telugu, goda devi story in telugu, bhakthimargam, bhakthi margam, bhakthi margam telugu, bhaktimargam, bhakti margam, thiruppavai pasuram in telugu mp3 free download, thiruppavai mp3 free download tamil m.s. subbulakshmi, thiruppavai in telugu pdf free download, thiruppavai telugu books, thiruppavai pasuram 23 meaning, thiruppavai 23rd pasuram in telugu, thiruppavai pasuram 23rd in telugu

Comments