కార్తీక పురాణము రెండవ రోజు పారాయణము | karthika puranam in telugu day 2 | bhakthi margam


కార్తీక పురాణము రెండవరోజు పారాయణము


తృతీయాధ్యాయము

బ్రహ్మర్షియైన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షియైన జనకునికి ఇంకా యిలా  చెప్పసాగాడు; 'రాజా! స్నానదాన జప తపాలలో దేవినిగానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా - అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలలాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో - ఆటువంటివాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు.

 శ్లో" పౌర్ణమ్యాం కార్తీకేమాసి స్నానాందీస్తు నాచరన్ !

        కోటిజన్మసు చండాలయోనౌ సంజాయతే నృప !!

శ్లో" క్రమాద్యోనౌ సముత్సన్నో భవతి బ్రహ్మరాక్షసః !

         అత్త్రై వోదాహరంతీ మ మితిహాసం పురాతనమ్ !!


 భావం: కార్తీక పౌర్ణమినాడు, స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటీ కూడా ఆచరించని వాళ్లు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి, తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను.

తత్త్వనిష్ఠోపాఖ్యానముః

అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్త్వనిష్ఠుడనే బ్రహ్మణుడుండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పకులనివాడూ, అన్ని భూతములయందునూ దయాళువూ, తీర్థాటన ప్రియుడూ అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్రా సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరీ తీరానగల ఒకానొక యెత్తయిన మర్రిచెట్టు మీద - కారు నలుపు  కాయచ్చాయ గలవాళ్లూ, ఎండిన  డొక్కలు కలవాళ్లూ, ఎర్రని నేత్రములు - గడ్డములూ కలవాళ్లూ, గ్రుచ్చబడిన ఇనుపతీగెలకుమల్లే పైకి నిక్కివున్న తలవెంట్రుకలతో, వికృత వదనార విందాలతో, కత్తులూ, కపాలాలూ ధరించి, సర్వజీవ భయంకరులుగా వున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు  నాలుగు  వైపులా  కూడా పన్నెండు మైళ్ల దూరంలో యెక్కడా ప్రాణి సంచారమనేదే వుండేది కాదు. అటు వంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత  దూరము నుంచే చూసిన  తత్వనిష్ఠుడు ఆదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు  కూడా తనను  చూడటంతో మరింత భయపడినవాడై - శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు.

తత్వనిష్ఠుడి శరణాగతి

శ్లో" త్రాహి దేవేశ లోకేశ! త్రాహి నారాయ ణావ్యయ

        సమస్త భయవిధ్వంసిన్! త్రాహిమాం శరణాగతం

        వ్యాసం పశ్యామి దేవేశ ! త్వత్తోహం జగదీశ్వర !!

s s

అంటే - "దేవతలకూ, లోకాలకూ కూడా యజమానివయిన వాడా ! నారాయణా ! అవ్యయా! నన్ను కాపాడు. అన్నిరకాల భయాలనూ అంతము చేసేవాడూ! నిన్నే శరణుకోరుతున్న నన్ను  రక్షించు. ఓ జగదీశ్వరా! నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగనివాడను. నన్ను కాపాడు రక్షించు" అని  యెలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడ నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వదించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకనే పరుగెత్తసాగినది. రక్కసులా పారునికి చేరువవుతున్న కొద్దీ, సాత్వికమైన విప్ర తేజస్సు కంటబడడం వలనా - తెరిపి లేకుండా  అతనిచే స్మరించబడుతూన్న హరినామము చెవులబడుట వలనా - వెంటనే వారికి జ్ఞానోదయమయింది.

 అదే తడవుగా ఆ బాపని కెదురుగా చేరుకొని, దండ ప్రణామా లాచరించి, అతనికి తమ వలన కీడు కలుగబోదని నమ్మబలికి,  'ఓ బ్రాహ్మణుడా! నీ దర్శనముతో మా పాపాలు  నశించిపోయాయి. అని పునః పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుట పడిన  హృదయముతో - తత్వనిష్ఠుడు 'మీరెవరు? చేయరాని పనులు  వేనిని చేయడం వలన యిలా అయిపోయారు? మీ మాటలు వింటుంటే బుద్దిమంతుల్లా వున్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ భయబాధావళి తొలగే దారి చెబుతాను' అన్నాడు.


ద్రావిడుని కథ

 పారుని పలుకులపై, ఆ రక్కసులలో ఒకడు తన  కథనిలా వినిపించసాగాడు. 'విప్రోత్తమా! నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మంధరమనే గ్రామాధికారినైన నేను, కులానికి బ్రహ్మణుడనే అయినా - గుణానికి కుటిలుడనీ, వంచనామయ వచః చమత్కారుడినీ అయి వుండేవాడిని. ణా  కుటుంబ శ్రేయస్సుకై, అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను.

 బంధువలకుగాని, బ్రాహ్మణులకు గాని యేనాడూ పట్టెడన్నమయినా పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడంచేత - నా కుటుంబము నాతో సహా ఏడు తరాల వాళ్లు అధోగతుల పాలయిపోయారు. మరణానంతరము దుస్సహమైన నరకయాతనల ననుభివించి చివరికిలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడవై - నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు' అన్నాడు.

ఆంధ్రదేశీయుని గాథ

రెండవ రాక్షసునిలా విన్నవించుకోసాగేడు - 'ఓ పవిత్రుడా! నేను ఆంధ్రుడను. నిత్యమూ నా తల్లిదండ్రులతో కలహించుచు, వారిని దూషించుచు వుండేవాడిని. నేను  నా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ, తల్లిదండ్రులకు మాత్రం చద్దికూటిని పడవేసే వాడిని. బందావ బ్రాహ్మణ కోటికేనాడూ ఒక పూటయినా భోజనము పెట్టక - విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికే వాడిని. ఆ శరీరము కాలంచేశాక నరకానపడి ఘోరాతి ఘోరమైన బాధలనుభవించి చివరి కిక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిదునికివలెనే - నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము' అని అన్నాడు.


పూజారి కథ

అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొఱపెట్టనారంభించాడు. 'ఓ  సదాచార సంపన్నుడా! నేను ఆంధ్రదేశపు బ్రహ్మణుడను. విష్ణ్వాలయంలో పూజారిగా వుండేవాడిని. కాముకుడనూ, అహంభావినీ, కఠినవచస్కుడినీ అయిన నేను - భక్తులు స్వామి వారికర్పించే కైంకర్యాలన్నిటినీ - నా వేశ్యలకు అందచేసి, విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వముతో తెరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి, వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని.

 ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి, అనంతరము యీ భూమిపై నానావిధహీన యోనులలోనూ, నానా నీచజన్మలనూ యెత్తి కట్టకడకీ బెట్టిదమయిన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ  సదాయుడా! నన్ను మన్నించి - మరలా జన్మించే అవసరం లేకుండా - మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా' అని ప్రార్ధించాడు.

బ్రహ్మరాక్షసులుత్తమ గతి పొందుట

తమ తమ పూర్వ భవకృత మహాఘరాశికి - ఎంతగానో పశ్చాత్తాప పడుతూన్న ఆ రక్కసులకు అభయమిచ్చి 'భయపడకండి - నాతో కలిసి  కార్తీక స్నానానికి రండి. మీ సమస్త దోషాలూ నశించిపోతాయి' అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడా బ్రహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు - బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి  తాను స్వయముగా ముందు స్నానం  చేసి, పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరము.

శ్లో" అముకానాం బ్రహ్మరాక్షసత్వ వివారణార్ధం !

అస్యాం కావేర్యాం - ప్రాతఃస్నాన మహం  కరిష్యే !!

అనే సంకల్పములతో అతడు విధివిధానముగా స్నానం చేసి, తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా - వారు  విగతదోషులూ - దివ్యవేషులూ అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు.

విదేహరాజా! అజ్ఞానము వలన కాని, మోహ - ప్రలోభాల వలన గాని, ఏ  కారణము చేతనైనా గాని - కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీనదిలో స్నానమాచరించి, విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా పదివేల యజ్ఞాలు చేసిన  ఫలము కలుగుతుంది. అందువల్ల - ఏదో ఒక ఉపాయం  చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి.

 కావేరీలో  సాధ్యము కాకపోతే  గోదావరిలోనైనా, మరెక్కడయినా సరే - ప్రాతః స్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానము చేయరో, వాళ్లు పది జన్మలు చండాలపు యోనులలో పుట్టి, అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమా! కాబట్టి -  ఎటువంటి మీమాంసతోటీ నిమిత్తం లేకుండా స్త్రీలుగాని, పురుషులుగాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలి.

చతుర్థాధ్యాయము

జనకుడు అడుగుతున్నాడు: "హే బ్రహ్మర్షీ ! నువ్వింతవరకూ కార్తీక మహాత్మ్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో యీ  వ్రత మాచరించాలో - ఏయే దానాలు చేయాలో కూడా  తెలియజేయి."

వశిష్ట ఉవాచ: అన్ని పాపాలనూ మన్ను చేసేదీ, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేదీ అయిన యీ కార్తీక వ్రతానికి ఫలానా 'సంకల్పము' అనేది హాస్యాస్పదమయిన విషయము.

ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రత ధర్మాలనూ, తత్ఫలాలనూ చెబుతాను విను.

కార్తీకమాసపు సాయంకాలము శివాలయములో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపురద్వార, శిఖరాలయందుగానీ - శివలింగ సన్నిధినిగానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలూ అంతరించిపోతాయి.

 ఎవరయితే కార్తీకములో శివాలయములో ఆవునేతితోగాని, నువ్వులనూనెతో గాని, ఇప్ప - నారింజనూనెలతో గాని దీప సమర్పణ చేస్తారో - వాళ్లు  ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నయినా సమర్పించిన వాళ్లు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము, కాంక్షతో గాని - నలుగురి నడుమా బడాయి కోసం గానీ దీపాన్నిచ్చే వాళ్లు కూడా శివప్రియులవుతారు. ఇందు కుదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను.

 కార్తీక దీపారాధనా మహిమ

పూర్వము పాంచాలదేశాన్ని పరిపాలించే మహారాజొకడు, కుబేరుని మించిన సంపద కూర్చుకుని వున్నా, కుమారులు లేని కారణంగా క్రుంగిపోయినవాడై, కరంగపాణికై తపస్సుకు  కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని - అతని తపస్సుకు  కారణమడిగి తెలుసుకుని, 'ఓ రాజా! ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పని లేదు. కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతమాచరించి, బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా  చేస్తే - నీకు తప్పక  పుత్రక సంతానము కలుగుతుందని" చెప్పాడు. బుషి వాక్యమును శిరోధార్యముగా తలచి - ఆ పాంచాలుడు తన  పట్టణము చేరి, కార్తీక వ్రతమాచరించి, శివప్రీతికై బ్రహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెల తప్పి, యుక్తకాలములో పురుష శిశువును ప్రసవించింది. రాజ దంపతులా శిశువుకి 'శత్రుజిత్తు' అని పేరు పెట్టారు.

శత్రుజిత్తు చరిత్రము

ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్థమానుడై పెరిగి, యువకుడై, వీరుడై వేశ్యాంగనా లోలుడై, అప్పటికీ తృప్తి చెందక, పరస్త్రీరక్తుడై,  యుక్తా యుక్త విచక్షణా నాస్తికుడై, శాస్త్ర దిక్కారియై, వర్ణసంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదరించుచు, స్వేచ్చాచారియై ప్రవర్తింపసాగేడు. అటువంటి సందర్భంలో -సౌందర్యరాశి సింహమధ్యమా, అరటి దోనెల వంటి తొడలు గలదీ, పెద్ద పెద్ద పిరుదులూ, కుచాలూ, కన్నులూ కలదీ, చిలుకవలే చక్కని పలుకులు గలదీయైన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది.

 శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య, శౌర్య, తేజో విరాజితుడైన  యీ యువరాజు పట్ల  ఆ బాపనిది కూడా మోజుపడినది. తత్కారణముగా - ఆమె రోజూ రాత్రి తన భర్త నిద్రపోగానే  - సంకేత స్ధలంలో రాజకుమారుని కలిసి - సురత క్రీడలలో సుఖించేది. రంకూ- బొంకూ దాగవు గదా! ఏదో విధంగా యీ సంగతి ఆ బాపనదాని భర్తకు తెలిసిపోయినది. అది మొదలు అతనొక కత్తిని ధరించి - ఈ రంకు జంటకు ప్రత్యక్షంగా చూసి, వారి గొంతు లుత్తరించాలని తిరుగుతున్నాడు. మహాకాముకురాలయిన జారిణిగాని,  ఆ శత్రుజిత్తుగాని యీ సంగతి నెరుగరు.

రోజులిలా గడుస్తూ వుండగా ఒకానొక కార్తీక పూర్ణిమా సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్ధానముగా యెంచుకున్నారు. అపరరాత్రివేళ వాళ్లు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా వుంది. ఆ బాపనిది తన చీరచెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడెక్కడినించో ఆముదమును  తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగములో లీనమయ్యారు.

ఈ విషయాన్ని ఆ బాపనదాని మొగుడెలాగో  తెలుసుకున్నాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తునీ, అనంతరం తన భార్యనూ తెగనరికి - తాను కూడా అదే  కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్లు  ముగ్గురూ ఆ రాత్రి అక్కడికక్కడే విగతజీవులు కాగానే - పాశహస్తులైన యమదూతలూ - పవిత్రాత్ములైన శివదూతలూ - ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలా రాకుమారుడినీ, రంకులాడినీ తమ  విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు.

 యమదూతలీ యమాయకపు బాపడిని తమతో నరకమువైపు లాగుకొనిపోసాగారు. అందుకచ్చెరుపడిన పారుడు - "ఓ  శివదూతలారా! కానిపని చేసిన వారికి కైలాసభోగము - నా వంటి సదాచారుడికి నరక యోగమూనా?' అని ప్రశ్నించగా, అందులకా శివదూతలు - 'వీరెంత పాపాత్ములయినా - ఈ రోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి, శివాలయములో - అందునా - శిథిలాయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనక, వారి పాపాలూ, నేరాలూ నశించి  పుణ్యాత్ములయ్యారు. 

ఏ కారణం చేతనైనాసరే కార్తీక మాసములో అందునా పౌర్ణమినాడు, పైగా సోమవారమునాడు దేవాలయములో దీపారాధనము చేయడం వలన అత్యధిక పుణ్యాత్యులైన వీళ్లని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా  నువ్వు పుణ్యహీనుడివీ, పాపాత్ముడివీ అయ్యావు. అందుకే, నీకు నరకము - వీరికి కైలాసము' అని చెప్పారు.

బ్రహ్మణుడికీ, శివపారిషదులకూ జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని, 'అయ్యలారా! దోషులము మేమైయుండగా, మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన  ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యము గాదు. 

కార్తీక మాసము దొడ్డదయితే, అందునా పూర్ణిమ గొప్పదయితే, సోమవారము మరీ ఘనమయనదయితే, దీపారధాన మరీ పుణ్యకరమైనదయితే మాతోబాటే కలసి  మరణించిన ఆ బాపనికి కూడా కైలాసమీయక తప్ప'దని వాదించడం జరిగింది. తత్ఫలముగా - శత్రుజిత్తు తానూ, తన ప్రియురాలూ ఆచరించిన వత్తీ, తైలముల పుణ్యము తాముంచుకుని, ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు ధారపోయగా , శివదూతలా విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి - తమతో  కైలాసానికి తీసికొనివెళ్ళారు.

కాబట్టి, ఓ మిధిలానగరాధీశ్వరా ! కార్తీకమాసములో తప్పనిసరిగా - శివాలయములోగాని, విష్ణ్వాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్లు జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందునా, శివాలయములో చేసిన దీపారాధన విరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని - కార్తీక మాసము నెల పొడుగునా నువ్వు శివాలయములో దీపారాధన చెయ్యి.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్మ్యమందు చతుర్థాధ్యాయ స్సమాప్త:

2 వ రోజు

నిషిద్ధములు :- తరగబడిన వస్తువులు

దానములు :- కలువపూలు, నూనె, ఉప్పు

పూజించాల్సిన దైవము :- బ్రహ్మ

జపించాల్సిన మంత్రము :- ఓం గీష్పతయే - విరించియే స్వాహా      

ఫలితము :- మనః స్థిమితము

రెండవరోజు పారాయణము సమాప్తము

Related Postings:

1. Stotras In Telugu

5. Rashi Phalalu

Tags: karthika puranam first day story in Telugu, karthika puranam telugu, karthika masam 2023, karthika masam 2023 start date telugu, karthika puranam story in telugu, karthika masam visistatha by chaganti koteswara rao, karthika puranam by chaganti, karthika masam story in telugu, karthika puranam by bhakthi margam, Importance of Karthika Masam, karthika masam upavasam ela cheyali, karthika masam pooja vidhanam in telugu, karthika masam fasting Rules, karthika puranam full in telugu, కార్తీక పురాణం రెండవరోజు కథ  Karthika Puranam 2nd Day Karthika Puranam in Telugu  , Bhakthi Margam, Bhakthi Margam telugu, Telugu Bhakthi margam, Bhakti margam, bhakti margam telugu, bhakthimargam.com, bhakthimargam.in

Comments