అయ్యప్ప దీక్షలో పాటించాల్సిన నియమాలు
కార్తీక మాసం నుంచి.. మకర సంక్రాంతి వరకూ అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాల వేసుకుంటారు. 41 రోజుల పాటు.. కఠినమైన నియమ నిష్టలతో దీక్షను కొనసాగిస్తారు. ఈ దీక్షలో నియమాలకు చాలా ప్రాధన్యత ఇస్తారు. వీటికి శాస్త్రపరంగానే కాదు.. వారి ఆరోగ్యపరంగా కూడా నియమాలను రూపొదించారు. మరి ఆ నియమాలు ఏంటి.. వాటి వెనుక కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శివకేశవుల భక్తులందరినీ ఈడేర్చవచ్చినవాడే అయ్యప్ప! `అయ్యా`అన్నా`అప్పా` అన్నా ఆదుకునేవాడే ఈ హరిహరసుతుడు. కార్తీకమాసం దగ్గరపడుతోందంటే చాలు శబరిమలను చేరేందుకు 41 రోజుల దీక్షను ధరించాలని ఉవ్విల్లూరుతుంటారు భక్తులు. కేవలం 18 మెట్లను ఎక్కి శబరిగిరీశుని చూసేందుకు పట్టే దీక్ష కాదు ఇది. భౌతిక సుఖాలను కాదనుకుని, ప్రకృతి పెట్టే పరీక్షలో నిగ్గుదేలి, స్వామి సన్నిధికి సవినయంగా చేరుకునే అరుదైన అవకాశం! మాలధారణలో ఉన్న కొన్న నియమాలు, వాటి వెనుక ఉన్న అంతరార్థం…
అయ్యప్ప స్వామి భక్తులు కార్తీకమాసం నుంచి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు కఠినమైన నిమయాలు పాటిస్తూ అయ్యప్ప మాల వేసుకుంటారు. అప్పటివరకు ఎలా ఉన్నా.. మాల వేసుకున్న నాటి నుంచి నియమాలు, నిబంధనలు కచ్చితంగా మార్చేసుకుంటారు. స్వామి చింతనలో, స్వామి భక్తులతో సమయం గడుపుతూ.. సాత్విక జీవనం అవలంభించుకుంటారు. తెల్లవారుజామునే చన్నీటి స్నానంతో మొదలయ్యే నియమాలు.. రాత్రి నేలపై పడుకోవడంతో ముగుస్తాయి. ఇలా ఒకటా, రెండా.. ఒక మండలం అనగా 41రోజులు పాటు ఈ నియమాలను భక్తి, శ్రద్ధలతో పాఠిస్తారు.
అయ్యప్ప దీక్షా నియమాలు
1. గురుస్వామి, తల్లిదండ్రులు, అర్చకస్వామి ద్వారా మాల ధరించాలి.
ముందు రోజు మద్యం, మాంసం తినరాదు. ఎలాంటి వారైనా దీక్ష పూర్తి చేసుకొని మెట్లు ఎక్కే వరకు 41 రోజులు ఈ దీక్ష పూర్తి చేయాలి.
2. అయ్యప్ప మాలధారులు నలుపు రంగు వస్త్రాలు ధరించాలి.
(అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ధరిస్తారు. ఎందుకంటే శని దేవుడికి నల్లని రంగు అంటే మక్కువ. ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏ మాత్రం ఉండదని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు చలికాలంలోనే అయ్యప్పమాలను ధరిస్తారు. కాబట్టి ఆ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు.)
3. ఉభయ సంధ్యల్లో చన్నీళ్లతో శిరస్నానం ఆచరించి స్వామికి దీపారాధన చేసి, స్తోత్రపఠం చేయాలి. దేవతార్చన జరిపి, మధ్యాహ్నం బిక్ష, రాత్రికి అల్పాహారం తీసుకోవాలి. నల్లని దుస్తులు ధరించాలి. రోజూ దేవాలయాన్ని దర్శించాలి. పాదరక్షలు ధరించరాదు.
4. మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టిపరిస్థితిలోనూ తీయరాదు. అయ్యప్ప సన్నిధానానికి చేరడానికి కనీసం 41 రోజులు ముందు దీక్ష ఆరంభించాలి.
5. మాల ధరించిన నాటి నుంచి.. స్వామి అనే పిలవాలి.
(అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది. శరీరానికి ఉండే పేరు, వాటి కోసం ధరించే దుస్తులు, తీసుకునే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అంతా మారిపోతాయి. అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతర్థానంలో భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో ‘స్వామి’ అని పిలవాలని నిబంధనను పెట్టారు.)
6. స్వాములు నేలపైనే నిద్రించాలి. పరుపులు, దిండ్లు పాదరక్షలు వాడకూడదు. మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధితో బ్రాహ్మచారిత్వం పాటించాలి. పగలు నిద్రించకూడదు.
(అయ్యప్ప దీక్షలో ఉండే వారు నేలపై నిద్రించడం వల్ల వెన్నునొప్పి సమస్యలు తొలగిపోతాయి. కండరాల బలపడేందుకు దోహదపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తెల్లవారుజామునే నిద్ర లేచి చల్లని స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుందని నమ్ముతారు.)
7. పగలు బిక్ష, రాత్రి అల్పాహారం తీసుకోవాలి. బిక్ష ఎవరైనా శుభ్రంగా తయారు చేసి పెట్టొచ్చు. కానీ బయటి తినుబండారాలు తినకూడదు.
8. ఉదయం, సాయంత్రం రెండు పూటల చన్నీటితో స్నానం చేయాలి. వేకువజామునే నిద్రలేచి పూజాస్థలాన్ని శుభ్రపరిచి బ్రహ్మ ముహూర్తాన అయ్యప్పస్వామికి పూజ చేయాలి.
9. అశుభ కార్యాల్లో పాల్గొనకూడదు. అవసరమైతే తప్పా దూర ప్రయాణాలు చేయకూడదు.
10. నిద్రించేప్పుడు, పాద నమస్కారం చేసేటప్పుడు మెడలో ఉన్న మాల నేలకు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
11. దీక్షలో ఉండగా రక్తసంబంధీలకులు, దగ్గరి బంధువులు, దాయదులు మరణిస్తే మాలను విసర్జింపజేయాలి.
(తల్లిదండ్రులలో ఎవరు మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు. అలాగే భార్య మరణించిన తర్వాత ఆరు నెలల వరకు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి.)
12. అస్కలిత బ్రహ్మచర్యం పాటించి, యోగిగా జీవించాలి. ఇంటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. దాంపత్యజీవితం, మనోవాక్కాయ కర్మలను తలచుట కూడా అపరాధం. పరుపులు, దిండ్లు ఉపయోగించరాదు. నేల మీద కొత్త చాప పరచుకొని శయనించాలి.
13. శవం, బహిష్టు అయిన మహిళల చూడరాదు. ఒకవేళ అలా చూసిన యెడల పంచగవ్య శిరస్నానం చేసి, శరణుఘోష చెప్పినంత వరకు మంచి నీళ్లైనా ముట్టుకోరాదు.
15. స్వాములు చేసే దీక్ష, పూజ, భుజించే బిక్ష, నిద్ర సృష్టి ప్రమాణానికి అనుకూలంగా ఉండాలి.
16. దీక్షా కాలంలో 'స్వామియే శరణమయ్యప్ప' అనే మూల మంత్రాన్ని ఎల్లవేళలా జపించాలి. మాలధారణలో ఉన్నప్పుడు స్త్రీలను భార్యతోసహా దేవతామూర్తులుగా భావించాలి. పేరు చివర 'అయ్యప్ప' అని పదం చేర్చాలి. ఇతరులను 'అయ్యప్పా' లేదా స్వామి అని పిలవాలి. మహిళను మాతా అని సంభోదించాలి.
17. ఎవరైనా భిక్షకు పిలిస్తే తిరస్కరించరాదు.
18. ఇంట్లోనే వేరైన గదిలో ఉండాలి. నిత్యం స్వామి భజన కార్యక్రమాల్లో పాల్గొనాలి.
19. నుదుటిపై ఎల్లప్పుడూ విభూధి, చందనం, కుంకుమ ధరించాలి. మద్యం సేవించడం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. తాంబూలం కూడా నిషిద్ధమే.
20. సాత్వికాహారాన్ని తీసుకోవాలి. రాత్రిపూట అల్పాహారం. స్వామి శరణు ఘోష ప్రియుడు కాబట్టి నిరంతరం భజనల్లో పాల్గొనాలి. హింసాత్మక చర్యలకు దూరంగా వుండాలి. అబద్దమాడటం, దూషణ చేయరాదు. అధిక ప్రసంగాల దూరంగా ఉండాలి.
21. స్వామికి అర్చన చేసిన తర్వాత ఇష్టదైవాన్ని ధ్యానించాలి. అష్టరాగాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్యలకు దూరంగా ఉండాలి.
21. దీక్షా సమయంలో తమ శక్తిమేరకు కనీసం ఒకసారైనా అయ్యప్పలకు భిక్ష పెట్టాలి. స్వామి కర్పూరం ప్రియుడు. కాబట్టి ఉభయ సంధ్యల్లో కర్పూర హారతి ఇవ్వాలి.
22. దీక్షా సమయంలో వయస్సు, హోదా, అంతస్తు మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనం చేయడానికి వెనుకాడరాదు. తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం చేయవచ్చు. దీక్షలేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు.
23. స్వామికి నెయ్యితో అభిషేకం చేసి.. అభిషేక ప్రసాదంతో ఇంటికి వచ్చి సన్నిదానం కదిపిన తరువాతనే మాల విసర్జన మంత్రాన్ని చెప్పుకొని గురుస్వామి లేక కన్నతల్లితో మాల విసర్జన చేసి దీక్షను ముగించాలి.

Comments
Post a Comment